
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు..ఇవ్వాళ రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే ముందంజలో ఉంది టీమిండియా. 1-0 తేడాతో ఇంగ్లాండ్పై ఆధిక్యతను సాధించింది. సౌతాంప్టన్లో జరిగిన తొలి టీ20లో ప్రత్యర్థిని ఏకంగా 50 పరుగుల తేడాతో మట్టి కరిపించిన కదనోత్సాహంలో కనిపిస్తోంది టీమిండియా. ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ధోరణిలో ఉంది ఇంగ్లాండ్ జట్టు.
ఈ రెండో టీ20 మ్యాచ్కు బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ పిచ్ ఘన చరిత్ర ఎలాంటిదో టీమిండియా అభిమానులకు బాగా తెలుసు. ఇంగ్లాండ్తో ఆడిన అయిదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిన పిచ్ ఇది. మ్యాచ్ మొత్తం మీద భారత జట్టు పట్టు బిగించినప్పటికీ..చిట్టచివరి సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు విశ్వరూపాన్ని చూపించింది ఈ పిచ్పైనే. 200లకు పైగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారిక్కడ. జో రూట్, జానీ బెయిర్స్టో.. సెంచరీలు సాధించి మరీ భారత్కు పరాజయాన్ని రూచి చూపించారు.
ఇప్పుడలాంటి పిచ్పై టీమిండియా.. రెండో టీ20 మ్యాచ్ ఆడబోతోంది. మ్యాచ్ కొనసాగడానికే అవకాశాలు ఉన్నాయి. అయిదో టెస్ట్ మ్యాచ్లో అప్పుడప్పుడూ వర్షం కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితి లేదు. వాతావరణం బాగుంది. క్లియర్ స్కై ఉంటుందని బర్మింగ్హామ్ వాతావరణ శాఖ పేర్కొంది. పగటి ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదు కావొచ్చు. రాత్రి వేళ 16 నుంచి 14 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి.
టీమిండియా తుదిజట్టులో.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టులో- జోస్ బట్టర్ (కేప్టెన్ వికెట్ కీపర్), జేసన్ రాయ్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టొన్, హ్యారీ బ్రూక్, సామ్ కుర్రన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లే, మార్క్ పార్కిన్సన్ ఆడొచ్చు.