టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో వన్డే ఆఫ్ లైన్ టికెట్ల కోసం స్టేడియం దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారి.. పోలీసులు వాటర్ గన్స్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది.
టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. తొలి వన్డే నాగ్ పూర్ వేదికగా జరగనుండగా.. రెండో వన్డే ఒడిశా కటక్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే చాలా కాలం తర్వాత కటక్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండగా.. అక్కడి ప్రేక్షకుల్లో ఉత్సాహం భారీ స్థాయిలో నెలకొంది. తాజాగా ఈ మ్యాచ్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ ను ఓపెన్ చేశారు మ్యాచ్ నిర్వాహకులు. దీంతో భారీ స్థాయిలో క్రికెట్ ఔత్సాహికులు టికెట్లను పొందాలని బారాబతి స్టేడియానికి చేరుకున్నారు. కోహ్లీ, రోహిత్ ఆడే ఈ మ్యాచులను ఎలాగైనా వీక్షించాలని, టికెట్ల కోసం రాత్రి నుంచే మైదానం దగ్గర బారులు తీరారు.

అధికారులపై విమర్శలు..
ఈ అనుకోని పరిణామంలో ఆగ్రహానికి గురైన స్థానికులు.. సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అధికారులను నిందిస్తున్నారు. ఎగ్జిట్ మార్గాలను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందిందని.. తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని విమర్శిస్తున్నారు.
భారీ భద్రత ఏర్పాట్లు
మరోవైపు ఇప్పటికీ ఈ మ్యాచ్ కోసం భారీ స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గేట్లను ఏర్పాటు చేసినట్లు, ఆంబులెన్స్ లు, మెడికల్స్ టీమ్స్, శానిటరీ సిస్టమ్స్ ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.