
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్కు బ్యాడ్ టైమ్ వెంటాడుతోంది. మొన్నటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, సీజన్ 15వ ఎడిషన్ నుంచీ ఏదీ కలిసి రావట్లేదు. ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్కు నాయకత్వాన్ని వహించిన కేన్.. తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాడు. అటు కేప్టెన్గా జట్టుకు విజయాలను అందించలేకపోయాడు. చివరి మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయాడు.
అతని ఫెయిల్యూర్స్.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్లోనూ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీరు గాడినపడలేదు. క్రీజ్లో కుదురుకుని ఆడటానికి అవకాశం ఉన్న టెస్ట్ మ్యాచ్లోనూ విఫలం అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు.. ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో లార్డ్స్లో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారీ స్కోర్ చేయలేకపోయాడు.
తొలి ఇన్నింగ్లో రెండు, రెండో ఇన్నింగ్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో అయిదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రెండో టెస్ట్కు దూరం అయ్యాడు కేన్ విలియమ్సన్. దీనికి కారణం- అతను కరోనా వైరస్ బారిన పడటమే. రెండో మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతనికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీనితో క్వారంటైన్లోకి వెళ్లాడు. తొలి టెస్ట్ ఆడట్లేదు.
ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ ఇవ్వాళే ఆరంభం కానుంది. నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ స్టేడియంలో ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ మొదలవుతుంది. ఈ సమయంలో కేన్ విలియమ్సన్ కోవిడ్ బారిన పడటం న్యూజిలాండ్ జట్టులో ఆందోళనలకు గురి చేసింది. కాగా- కేన్ విలియమ్సన్ తప్పుకోవడంతో అతని స్థానంలో టామ్ లాథమ్ కేప్టెన్గా అపాయింట్ అయ్యాడు. అతని సారథ్యంలో కివీస్ జట్టు.. ఇంగ్లాండ్ను ఎదుర్కొంటుంది.
కేన్ స్థానంలో హమీష్ రూథర్ఫర్డ్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. డొమెస్టిక్ టీ20 మ్యాచ్లను ఆడటానికి న్యూజిలాండ్ జట్టు తరఫున ప్రస్తుతం అతను ఇంగ్లాండ్లోనే ఉన్నాడు. అప్పటికప్పుడు హమీష్కు కబురు పంపారు. కీలకమైన మ్యాచ్లో కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరమేనని న్యూజిలాండ్ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ వ్యాఖ్యానించాడు.