
ముంబై: ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సన్నాహాలు చేస్తోంది. ఆస్ట్రేలియా దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ప్లేయర్ల పేర్లను అందజేయాలంటూ ఇదివరకే ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకూ ఆదేశాలను జారీ చేసింది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కావడం వల్ల అన్ని జట్లూ అంతర్జాతీయ మ్యాచ్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతో బిజీ షెడ్యూల్ను ఎదుర్కొంటోంది టీమిండియా. మూడు నుంచి నాలుగు నెలల పాటు టీమిండియా ప్లేయర్లు అంతర్జాతీయ పర్యటనల్లో తలమునకలు కానున్నారు. విదేశీ పర్యటనల్లో భాగంగా తొలి సిరీస్.. ఐర్లాండ్తో ఆరంభం కానుంది. దీని తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకల్లో పర్యటిస్తుంది. ఇక ఆసియాకప్ 2022 ఎలాగూ ఉండనే ఉంది.
ఐర్లాండ్తో రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లను ఆడనుంది భారత క్రికెట్ జట్టు. ఈ నెల 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఈ రెండూ షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్లు ఆరంభమౌతాయి. ఐర్లాండ్తో ఈ రెండు టీ20 మ్యాచ్ల కోసం భారత జట్టుకు ఇదివరకే జట్టును ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్గా అపాయింట్ అయ్యాడు.
సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కేప్టెన్. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ సెలెక్ట్ అయ్యారు. ఇంగ్లాండ్లో ఆ దేశ జట్టుతో ఓ టెస్ట్ మ్యాచ్ సహా మూడు చొప్పున టీ20లు, వన్డే ఇంటర్నేషనల్స్ను ఆడాల్సి ఉంది టీమిండియాకు. ఈ సిరీస్ వచ్చేనెల 1వ తేదీన ఆరంభమౌతుంది.
ఈ టెస్ట్ ముగిసిన తరువాత.. మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్లో ఇంగ్లాండ్తో టీమిండియా తలపడుతుంది. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్, 14న లార్డ్స్లో ఈ రెండు మ్యాచ్లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.
ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా జట్టును ఎంపిక చేయనుంది వచ్చేవరం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ముగిసిన తరువాత లేదా సిరీస్ ముందే ఇంగ్లాండ్తో తలపడబోయే వన్డే, టీ20 జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ జట్టులోకి రానున్నారు. కేఎల్ రాహుల్.. గాయం వల్ల ఈ సిరీస్కు కూడా అందుబాటులో ఉండట్లేదు. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్, జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.