లండన్: ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ ఏ ముహూర్తంలో అడుగు పెట్టాడో గానీ వైఫల్యాలు అతణ్ని వెంటాడుతోన్నాయి. తీవ్రంగా విమర్శలకు గురి చేస్తోన్నాయి. లార్డ్స్లో ముగిసిన రెండో వన్డేలోనూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో వాటి తీవ్రత కాస్త మరింత పెరిగింది. టీ20తో పాటు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్లోనూ అతను తడబడుతున్నాడు. భారీ స్కోర్ చేయలేక వెనుదిరుగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడు కోహ్లీ భాయ్.
కోహ్లీ పనైపోయిందని, ఇక అతణ్ని జట్టు నుంచి సాగనంపాల్సిన అవసరం ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు కపిల్ దేవ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీకి మాత్రం అతని సమకాలీన క్రికెటర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. టీమిండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ కేప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, జోస్ బట్లర్.. విరాట్కు అండగా నిలిచారు. అతనిపై వస్తోన్న విమర్శలను కొట్టి పారేస్తోన్నారు.
ఈ విమర్శలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయని బట్లర్ వ్యాఖ్యానించాడు. ఇవి- కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్పై చేయాల్సిన వ్యాఖ్యలు, విమర్శలు కావని అన్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ చాలా విలువైన ఆటగాడని ప్రశంసించాడు. ఇప్పటికీ అతణ్ని త్వరగా అవుట్ చేయడాన్ని గొప్పగా భావిస్తామని చెప్పాడు. కోహ్లీ వికెట్ కోసం డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యేకంగా చర్చిస్తామనీ అన్నాడు. అందరిలాగే కోహ్లీ కేరీర్ కూడా ఎత్తు పల్లాలను చవి చూస్తోందని, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
కోహ్లీ గొప్ప ప్లేయరా? కాదా? అనేది అతని రికార్డులను తిరగేస్తే తెలిసిపోతుందని వ్యాఖ్యానించాడు. ఒకట్రెండు మ్యాచ్లల్లో భారీ స్కోర్ చేయనంత మాత్రాన తప్పు పట్టడం సరికాదని అన్నాడు. ప్రత్యర్థి జట్టు కేప్టెన్గా లేదా ప్లేయర్గా గ్రౌండ్లో విరాట్ కోహ్లీని ఎదుర్కొనడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ఎన్నో మ్యాచ్లను గెలిపించాడని గుర్తు చేశాడు. అలాంటి ఆటగాడి ప్రదర్శనను ఒకట్రెండు మ్యాచ్లతో నిర్ధారణకు రాలేమని అన్నాడు.