
ముంబై: భారత్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం పుట్టించింది. పలువురు యంగ్ క్రికెటర్ల కేరీర్ను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి- టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ కేరీర్పై అనుమానాలు కమ్ముకునేలా చేసింది. కరోనా వైరస్ బారిన పడ్డ స్పిన్నర్ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగినందున తోటి క్రికెటర్లతో పాటు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఐసొలేషన్లో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితిని కల్పించింది. మరో రెండు రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కావాల్సిన ఈ దశలో ఐసొలేషన్లో ఉంటోన్నారు.
పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఐసొలేషన్ నుంచి బయటికి రానున్నారు. తాజాగా- వారిద్దరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో వారు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో 24 గంటల్లో వారు లండన్ విమానం ఎక్కుతారని సమాచారం. ఇంగ్లాండ్ జట్టుతో ఆ దేశ గడ్డ మీద అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడటానికి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ జట్టు ప్రస్తుతం అక్కడే ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ల సందర్భంగా శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ గాయపడటం వల్ల వారిద్దరి స్థానంలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లను టెస్ట్ జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు.
అదే సమయంలో శ్రీలంక సిరీస్ సందర్భంగా కరోనా వైరస్ బారిన పడ్డ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన కారణంగా ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఐసొలేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఎనిమిది మందిలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా కూడా ఉన్నారు. టెస్ట్ మ్యాచుల్లో ఆడాల్సి ఉన్నందున.. అందరి దృష్టీ వారిద్దరిపైనే నిలిచింది. ఇంకో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 4వ తేదీన నాటింగ్ హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో భారత జట్టు ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఆడాల్సి ఉంది. ఈ దశలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఐసొలేషన్లో ఉండటం వల్ల తొలి టెస్ట్ ఆడలేకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా- పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లకు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నట్టయింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి రాగానే వారిద్దరూ ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్తారు. టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కేప్టెన్), అజింక్య రహానె (వైస్ కేప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్, (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్వాలా వ్యవహరిస్తారు.