
లండన్: క్రికెట్ ప్రేమికులు నెలన్నర రోజులుగా ఎదురు చూస్తోన్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇంకో రెండు రోజులు.. బుధవారం మధ్యాహ్నానికి తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు టాస్ పడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ సిరీస్ ఇది. దీనికోసం రెండు జట్లు కఠోర సాధన చేస్తోన్నాయి. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు అందిస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ద్వారా తెలియజేస్తోంది.
ఈ టెస్ట్ సిరీస్ను పురస్కరించుకుని పేస్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పలు విషయాలను ఇందులో ప్రస్తావించాడు. ఈ సిరీస్లో తాను రాణిస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో సత్తా చాటానని, అదే తరహాలో ఇంగ్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుంటానని చెప్పాడు.
ఇంగ్లాండ్ పిచ్, వాతావరణం పేస్ బౌలింగ్కు అనుకూలించేలా ఉన్నట్లు అంచనా వేస్తోన్నానని వ్యాఖ్యానించాడు. గత ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో సిరాజ్.. 13 వికెట్లను పడగొట్టిన విషయం తెలిసిందే. ఆ సిరీస్లో అత్యధిక వికెట్లను తీసుకున్న బౌలర్గా నిలిచాడు.
అదే ఫామ్ను ఇంగ్లాండ్పైనా కొనసాగిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ జో రూట్ను తాను టార్గెట్గా చేసుకున్నానని, అతని వికెట్ను పడగొట్టడంపైనే ఫోకస్ పెట్టానని వివరించాడు. నాలుగు టెస్ట్ మ్యాచ్లను ఆడటానికి ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా తాను జో రూట్ వికెట్లను తీసుకున్నానని గుర్తు చేశాడు.
ఆస్ట్రేలియా సిరీస్ అత్యంత కఠినమైనదని, అజింక్యా రహానె సారథ్యంలో మ్యాచ్లను ఆడటాన్ని ఎంజాయ్ చేశాననీ చెప్పుకొచ్చాడు హైదరాబాదీ పేస్ బౌలర్. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టెస్ట్ టీమ్.. స్వదేశంలో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.