
నాటింగ్హామ్: భారత్తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే పరుగుల ఖాతా తెరవకుండానే.. ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ 16, డొమినిక్ సిబ్లీ 7 పరుగులతో ఆడుతున్నారు.
భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులేస్తుండటంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోడ్చుతున్నారు. డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడుతుండగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ జులిపిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఏడవ ఓవర్లో క్రాలే ఫోర్ కొట్టగా.. మొహ్మద్ షమీ వేసిన తర్వాతి ఓవర్లో సిబ్లీ బౌండరీ బాదాడు. బుమ్రా వేసిన తొమ్మిదో ఓవర్లో క్రాలే మరో బౌండరీ బాదాడు. ఆ తర్వాత బుమ్రా, షమీలు వీరిద్దరిపై ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడం కష్టంగా మారింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్స్టో, ఆల్రౌండర్ సామ్ కరన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకున్నాడు. రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. దీంతో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు నిరాశే ఎదురైంది. పేస్ విభాగంలో హైదరాబాద్ గల్లీ భాయ్ మొహ్మద్ సిరాజ్కే కోహ్లీ ఓటేశాడు. ఇషాంత్ శర్మ బెంచ్కే పరిమితం అయ్యాడు. ఇక మరో హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారికి నిరాశే ఎదురైంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చేతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, డేనియల్ లారెన్స్, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.