
నాటింగ్హామ్: ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా టీమిండియాతో ఈరోజు ప్రారంభం అయిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి.. రూట్ అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. ఆపై మొహ్మద్ షమీ వేసిన 51వ ఓవర్లో రెండో బంతికి జానీ బెయిర్స్టో (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే అంపైర్లు టీ విరామం ప్రకటించారు. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 50.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది. క్రీజులో రూట్ 51 పరుగులతో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్గా వెనుదిరిగాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆపై భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులేయడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
జాక్ క్రాలే ఔటవ్వడంతో కెప్టెన్ జో రూట్ క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే రూట్ మంచి టచ్లో కనిపించాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ హ్యాట్రిక్ ఫోర్లతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం డొమినిక్ సిబ్లీ, రూట్ నిలకడగా ఆడారు. దీంతో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో 61 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ అనంతరం సిబ్లీ ఔట్ అయినా.. జానీ బెయిర్స్టో అండతో రూట్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. బెయిర్స్టో స్ట్రైక్ రొటేట్ చేస్తూ కెప్టెన్కు అండగా నిలబడ్డాడు.
మరోవైపు జో రూట్ చెత్త బంతులను బౌండరీలు పంపిస్తూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లో బెయిర్స్టో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇదే సమయంలో అంపైర్లు టీ విరామం ప్రకటించారు. రెండో సెషన్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తమ ఆధిపత్యం చెలాయించాయి. ముందుగా రూట్ టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచగా.. సెషన్ చివరలో బెయిర్స్టో వికెట్ పడగొట్టి భారత్ ఆధిపత్యం చెలాయించింది.