నాటింగ్హామ్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. గురువారం రెండో సెషన్లో భారత్ 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఈ సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే మైదానంలో వర్షం కురవడంతో.. మ్యాచ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (57; 148 బంతుల్లో 9x4) అర్ధ శతకంతో కొనసాగుతుండగా.. రిషభ్ పంత్ 7 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరుకు భారత్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 58 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.
భోజన విరామానికి ముందు 97/1తో పటిష్టస్థితిలో నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో నయా వాల్ చేతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (5) ఔటవ్వడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును గాడిలో పెడుతున్నారు. అంతలోనే వాతావరణం మ్యాచును అడ్డుకుంది. ఆపై వర్షం కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గే సూచనలు ఉండడంతో.. ఇరు జట్ల ఆటగాళ్లు టీ బ్రేక్ త్వరగా తీసుకున్నారు.
అంతకుముందు రెండో రోజు భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (9) పరుగులతో ఇన్నింగ్స్ను ఆరంభించారు. రెండో రోజు ఆటను భారత్ నెమ్మదిగా ఆరంభించింది. అండర్సన్, బ్రాడ్ పిచ్ పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని చెలరేగినా.. రోహిత్, రాహుల్ ఇద్దరూ ఆచితూచి ఆడారు. 3-4 ఓవర్ల పాటు పరుగులు చేయలేదు. క్రీజులో కుదురుకున్నాక స్ట్రైక్ రొటేట్ చేశారు. ఆపై చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ముఖ్యంగా రాహుల్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. రోహిత్ కూడా తనదైన శైలిలో ఫోర్లు బాదాడు. రాహుల్, శర్మల జోరు చూస్తే.. భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే భోజన విరామ సమయానికి ముందు రోహిత్ (36; 107 బంతుల్లో 4x6) ఔటయ్యాడు.
తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆడిన తొలి బంతికే ఔటయిన కోహ్లీ.. గోల్డెన్ డక్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ టీమిండియా కెప్టెన్ వికెట్ కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా విరాట్ టెస్టుల్లో గోల్డెన్ డక్గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో గోల్డెన్డక్గా వెనుదిరగడం విశేషం.
2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్లో, 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో రెండుసార్లు విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా అండర్సన్ బౌలింగ్లో మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. గోల్డెన్ డక్ విషయంలో కోహ్లీ మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా మూడుసార్లు గోల్డెన్ డక్గా వెనుదిరిగిన కోహ్లీ.. తొలి స్థానంలో ఉన్నాడు. లాలా అమర్నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండేసీ సార్లు గోల్డెన్ డక్ అయ్యారు.
Ind vs Eng: భారత్కు గోల్డ్ మెడల్ తెచ్చిన విరాట్ కోహ్లీ! అబ్బా.. అది తృటిలో మిస్ అయిందిరా నాయనా!!