ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో విజృంభించిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (79: 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు) అరుదైన ఘనత సాధించాడు. మ్యాచ్ లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను టచ్ చేసిన పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన పేరిట పలు సూపర్ రికార్డులను నమోదు చేశాడు. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.
టీ20 మ్యాచ్ లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా(70+ రన్స్) పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. గతంలో (2013) యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220 స్ట్రైక్ రేట్) చేశాడు. ఇప్పుడు అభిషేక్ 34 బంతుల్లోనే 79 (232.35 స్ట్రైక్ రేట్) రన్స్ సాధించాడు. దీంతో యూవీ రికార్డ్ బ్రేక్ అయింది.

ఇంగ్లాండ్ పై ఓ టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత్ బ్యాటర్ గా నిలిచాడు. గతంలో 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పై యువీ 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు అభిషేక్ తన మెంటార్ యువరాజ్ ఆల్టైమ్ రికార్డును అధిగమించాడు.
టీ20ల్లో ఇంగ్లాండ్ పై టీమిండియా తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు అభిషేక్ శర్. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ రికార్డును అధిగమించాడు. 2018లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ20లో ఇంగ్లాండ్ పై రాహుల్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఇప్పుడు అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను టచ్ చేశాడు. ఈ అరుదైన రికార్డు జాబితాలో యువరాజ్ సింగ్ టాప్ లో కొనసాగుతున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.
టీ20 మ్యాచ్లో భారత గడ్డపై అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ (70+ పరుగులు) ఆడిన ప్లేయర్గా ఘనత సాధించాడు అభిషేక్ శర్మ. గతంలో (2022లో) సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్.. గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 225.53 స్ట్రైక్ రేట్తో 106* పరుగులు చేశాడు. ఇప్పుడు అభిషేక్ 232.35 స్ట్రైక్ రేట్తో 79 పరుగులు చేశాడు.