
మూడు వన్డేల సిరీస్లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ను 110పరుగులకే ఇండియా ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. బూమ్ బూమ్ బుమ్రా (7.2-3-19-6) 6వికెట్ల హాల్ ప్రదర్శనకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తోకముడిచారు. ఇక బుమ్రాకు తోడు షమీ (7-0-31-3) 3వికెట్లతో అదరగొట్టాడు. క్రీజులోకి కుదురుకునేంత టైం కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లకు బుమ్రా, షమీ ఇవ్వలేదు. తొలి స్పెల్లో వీరిద్దరు 26పరుగులకే 5వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బతీశారు. ఇక ప్రసీద్ క్రిష్ణ సైతం (5-0-26-1) 1వికెట్ తీసి కాస్త పర్వాలేదనిపించాడు. ఇక జాసన్ రాయ్ (0), బెయిర్ స్టో (7), రూట్ (0), లివింగ్ స్టోన్ (0), బ్రైడన్ కార్స్ (15), డేవిడ్ విల్లీ (21)లను బుమ్రా పెవిలియన్కు పంపించగా.. బెన్ స్టోక్స్ (0), బట్లర్ (30), ఓవర్టన్ (8)లను షమీ బురిడీ కొట్టించాడు. మొయిన్ అలీ (14)ని ప్రసీద్ కాట్ అండ్ బౌల్ చేశాడు. ఇక ఇండియా పేసర్లు ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఘనత సాధించారు.
ఇక ఈ మ్యాచ్లో ఇండియా తరఫున ముగ్గురు పేసర్లు 10వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు, ఆల్రౌండర్లు కాకుండా ముగ్గురు పేసర్లే పూర్తి వికెట్లు తీయడం గమనార్హం. ఇలా టీమిండియా తరఫున పేసర్లే 10వికెట్లు తీయడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే. అంతకుముందు ఇలా ముగ్గురు పేసర్లే 10వికెట్లు తీసిన సందర్భాలు ఓసారి పరిశీలిస్తే..
1. 1983లో ఆస్ట్రేలియా మీద, 2. 1983లో లార్డ్స్లో విండీస్ మీద, 3.1997లో టొరంటోలో పాక్ మీద, 4. 2003లో జోహన్నెస్ బర్గ్లో శ్రీలంకపై, 5.2014లో మీర్పూర్లో బంగ్లాదేశ్పై ఇండియా పేసర్లు 10కి 10వికెట్లు తీశారు. ఇక 8ఏళ్ల తర్వాత నేడు ఓవల్లో ఇంగ్లాండ్పై తొలిసారి భారత పేసర్లు 10కి 10వికెట్లు తీశారు. ఇకపోతే తొలుత బౌలింగ్ వేసినప్పుడు ఇండియా 10వికెట్లు తీయడం ఇదే తొలిసారి.