టాపార్డర్ విఫలం..
అయితే ఈ మ్యాచ్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, సీనియర్ బౌలర్లు అశ్విన్, షమీ, ఇషాంత్ దూరంగా ఉండటంతో రోహిత్ శర్మ జట్టును నడిపిస్తున్నాడు. టాస్ గెలిచిన హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ(9) తీవ్రంగా నిరాశపరిచాడు. ఓవర్సీస్ గడ్డపై తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. రెండు బౌండరీలు బాది టచ్లోకి వచ్చిన రోహిత్.. లిండన్ జేమ్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(28),నయావాల్ చతేశ్వర్ పుజారా(21) చేతులెత్తేశారు. దాంతో 67 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న రాహుల్, జడేజా..
తెలుగు తేజం హనుమ విహారీ(24) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో భారత్ 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కనీసం 200 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం కలిగింది. కానీ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. సూపర్బ్ బ్యాటింగ్తో టీమ్ పరువు నిలబెట్టారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సెంచరీ అనంతరం రాహుల్ రిటైర్డ్ ఔట్గా వెనుదిరగ్గా.. జడేజా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్(20), అక్షర్ పటేల్(0), ఉడేశ్ యాదవ్(12) విఫలమయ్యారు. కౌంటీ టీమ్ బౌలర్లలో క్రైగ్ మైల్స్ మూడు వికెట్లు తీయగా.. లిండన్ జేమ్స్, లియామ్ ప్యాటర్సన్ రెండేసి వికెట్లు తీశారు. కౌంటీ తరఫున ఆడిన ఆవేశ్ ఖాన్ 10 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు.
అందుకే కోహ్లీ, రహానేకు విశ్రాంతి..
వాస్తవానికి ముందుస్తు ప్రణాళికలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు లేవు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత సర్వత్రా విమర్శలు రావడంతో బీసీసీఐ అప్పటికప్పుడు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఏర్పాటు చేసింది. దీనికి కౌంటీ క్రికెట్లో ఒక్కో టీమ్ నుంచి 14 మందితో కూడిన సెలెక్టీవ్ టీమ్ను ఎంపిక చేసింది. వార్విక్షైర్ టీమ్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించిన టీమిండియా మేనేజ్మెంట్.. ఫస్ట్ వామప్ మ్యాచ్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే సుందర్, ఆవేశ్ ఖాన్లను ప్రత్యర్థి టీమ్ తరఫున బరిలోకి దించింది. సీనియర్లు అయిన కోహ్లీ, ఇషాంత్, షమీ, అశ్విన్లకు విశ్రాంతినిచ్చింది. జూలై 28 నుంచి రెండో వామప్ మ్యాచ్ జరగనుంది.