చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఊహించనట్లుగానే పాకిస్థాన్ను ఓడించిన కొత్త ఉత్సాహంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో మొదటి రోజు ఆటలో తొలి రెండు సెషన్లలో భారత్పై బంగ్లా పైచేయి సాధించింది.
టీ విరామానికి టీమిండియా 48 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (21 నాటౌట్), రవీంద్ర జడేజా (7) ఉన్నారు. మొదటి ,రెండు సెషన్లలో భారత్ సరిగ్గా 88 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. అయితే బంగ్లాదేశ్కు భారత్ ఈ మాత్రం అయినా పోటీ ఇస్తుందంటే అది యశస్వీ జైస్వాల్ అర్ధశతక (56; 118 బంతుల్లో, 9 ఫోర్లు) పోరాటమే.

టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా పది ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. హసన్ మహ్మద్ నిప్పులు చెరిగే బంతులకు కెప్టెన్ రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్), శుభ్మన్ గిల్ (డకౌట్), విరాట్ కోహ్లి (6; 6 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ (39; 52 బంతుల్లో, 6 ఫోర్లు)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నాలుగో వికెట్కు పంత్తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
లంచ్ విరామం తర్వాత పంత్ ఔటైనప్పటికీ కేఎల్ రాహుల్ (16; 52 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి జైస్వాల్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. టెస్టు ఫార్మాట్లో ఆడిన 17 ఇన్నింగ్స్ల్లో జైస్వాల్కు ఇది అయిదో హాఫ్ సెంచరీ. మూడు శతకాలు కూడా సాధించాడు. అయితే ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఏడాది క్యాలెండ్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్గా చరిత్రకెక్కాడు.
బంగ్లాతో తొలి టెస్టు ప్రారంభానికి ముందు నాలుగో స్థానంలో ఉన్న జైస్వాల్ ఇద్దరిని అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో జో రూట్ (20 ఇన్నింగ్స్ల్లో- 986 పరుగులు) ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో యశస్వీ జైస్వాల్ (12 ఇన్నింగ్స్ల్లో- 796 పరుగులు), కామిందు మెండిస్ (10 ఇన్నింగ్స్ల్లో- 748 పరుగులు), ఒలీ పోప్ (11 ఇన్నింగ్స్ల్లో- 745 పరుగులు) ఉన్నారు. జైస్వాల్ ఇదే జోరు కొనసాగిస్తే రూట్ స్కోరు అధిగమించడం ఖాయమే. బంగ్లాతో రెండు, న్యూజిలాండ్తో మూడు టెస్టులు; ఆస్ట్రేలియాతో జరిగే అయిదు టెస్టుల సిరీస్లో నాలుగు టెస్టులను భారత్ ఈ ఏడాదే ఆడనుంది. ఈ మ్యాచ్ల్లో జైస్వాల్ టాపర్గా నిలవడం ఖాయమే!