చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. బంగ్లాపై 308 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (33 బ్యాటింగ్; 64 బంతుల్లో, 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 బ్యాటింగ్; 13 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ జస్ప్రీత్ బుమ్రా (4/50), ఆకాశ్దీప్ (2/19), రవీంద్ర జడేజా (2/19), మహమ్మద్ సిరాజ్ (2/30)ల ధాటికి.. 149 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్లో భారత్కు 227 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే భారీ ఆధిక్యం దక్కినా టీమిండియా ఫాలోఆన్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది. కొన్ని కారణాలతో రోహిత్ సేన ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్కు బంగ్లాదేశ ఇచ్చిన షాక్ను దృష్టిలో పెట్టుకోవడం, అలాగే మన బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో భారత్ ఫాలోఆన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై ఓడించి బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని అందుకున్న విజయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ తొలి మ్యాచ్లో బంగ్లాను పాక్ తక్కువగా అంచనా వేసి కంగుతింది. పాకిస్థాన్ 448/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏకంగా 565 పరుగుల భారీ స్కోరు చేసింది. అదే జోరులో తొలి టెస్టును కైవసం చేసుకుంది. చెపాక్లోనూ బంగ్లాదేశ్ ఇదే తరహా పోరాట ప్రదర్శన చేస్తే మ్యాచ్ను కోల్పోవాల్సి వస్తుందని టీమిండియా భావిస్తుంది. ఈ నేపథ్యంలో బంగ్లాకు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించాలని యోచిస్తోంది.
మరో కారణం బౌలర్లుకు విశ్రాంతి ఇవ్వాలని. ప్రస్తుత టెస్టులో మన బౌలర్లు 47.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు. ఇది అంతగా అలసటకు గురిచేసేది కాదు. కానీ భారత్ వరుసగా సిరీస్లు ఆడనుంది. ఇందులో మరో తొమ్మిది టెస్టులు కూడా ఉన్నాయి. దీంతో బౌలర్లకు పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫాలోఆన్ ఇవ్వలేదు. కాగా, ఫాలోఆన్ ఇచ్చిన తర్వాత ఓ జట్టు టెస్టు గెలిచిన సందర్భాలు నాలుగు మాత్రమే. ఆస్ట్రేలియాపై 1984, 1981లో ఇంగ్లండ్, 2001లో భారత్, 2023లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ విజయం సాధిచాయి.