దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది.
ఈ సిరీస్ను క్వీన్స్వీప్ చేసి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. స్వదేశంలో టీమిండియాను ఓడించాలంటే బలమైన జట్లకే అంత సులువు కాదు. ఇక బంగ్లాదేశ్తో సిరీస్ అంటే రోహిత్ సేనదే పైచేయి అవ్వడం ఖాయమే. కానీ ఈసారి లెక్క మారుతుందని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు.

రెండు టెస్టులు గెలిచి, భారత్ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, విజయం సాధిస్తామని నజ్ముల్ హొస్సేన్ షాంటో పేర్కొన్నాడు. అయిదు రోజులు గట్టి పోటీని ఇచ్చి ఆఖరి సెషన్లో పైచేయి సాధించి మ్యాచ్లు గెలుస్తామని తమ ప్రణాళిక వివరించాడు. ''రెండు టెస్టులను గెలిచేలా మేం ఆడతాం. విజయం సాధించడానికి ప్రధానమైనది మనం ఆడే ప్రక్రియ. మా పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తాం. అలా చేస్తే ఫలితాలు వాటంతట అవే అనుకూలంగా వస్తాయి''
''ర్యాంకింగ్ పరంగా చూస్తే భారత్ మా కంటే ఎంతో పైస్థాయిలో ఉంది. కానీ మేం ఇప్పుడు బాగా ఆడుతున్నాం. ఇటీవల మంచి సిరీస్ గెలిచాం (పాకిస్థాన్ సిరీస్ను ఉద్దేశించి). అయిదు రోజులు మంచి ఆట ఆడటమే మా లక్ష్యం. ఆఖరి రోజు చివరి సెషన్లో ఫలితం వస్తుంది. అయిదు రోజులు బాగా క్రికెట్ ఆడితే ఆఖరి సెషన్లో పైచేయి సాధించినవాళ్లే విజయం సాధిస్తారు'' అని షాంటో పేర్కొన్నాడు.
ఇటీవల పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో సాధించిన ఈ విజయం బంగ్లా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ ఉత్సాహంతో భారత్పై కూడా పైచేయి సాధించాలని బంగ్లా కెప్టెన్ షాంటో భావిస్తున్నాడు.
భారత్తో టెస్టు సిరీస్కు ఎంపికైన బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జేకర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లామ్, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్.