దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు మాత్రమే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.
కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరిగే రెండో టెస్టుకు, అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్కు ఒకేసారి భారత జట్టును ప్రకటించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే బంగ్లాతో టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్ను తప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్లో న్యూజిలాండ్ జరిగే మూడు టెస్టుల సిరీస్ను దృష్టిలో ఉంచుకొని బంగ్లాతో టీ20 సిరీస్కు గిల్కు విశ్రాంతి ఇస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రిషభ్ పంత్కు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పంత్కు విశ్రాంతి ఇస్తే ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి వస్తాడు. ''బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇస్తున్నాం. భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్ చూడండి. అక్టోబర్ 7న గ్వాలియర్లో, 10న ఢిల్లీలో, 13న హైదరాబాద్లో మ్యాచ్లు ఉన్నాయి''
''అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ టీ20 సిరీస్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు మధ్య మూడు రోజుల వ్యవధినే ఉంది. కాబట్టి గిల్కు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం'' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. భారత వన్డే, టీ20 జట్ల వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్లో ఇండియా-ఏకు కెప్టెన్సీ చేసిన గిల్ 25, 21 పరుగులే చేశాడు.