భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టెస్టు ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాన్పూర్ వేదికగా ఇవాళ నుంచి చివరి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు టాస్ పడాలి. కానీ టాస్ ఆలస్యం కానుంది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంతో టాస్ను ఆలస్యసం చేశారు. మరో 30 నిమిషాల తర్వాత అంపైర్లు మైదానాన్ని పరీక్షించనున్నారు.
ఇన్స్పెక్షన్లో అంపైర్లు సంతృస్తి చెందితే మ్యాచ్ను కొనసాగిస్తారు. లేదంటే మరికాసేపు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇవాళ ఉదయం కాన్పూర్లో వర్షం పడలేదు. కానీ నిన్న రాత్రి కురిసిన వాన కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా ఏర్పడింది. మైదానాన్ని పూర్తిగా కవర్లతో ఉంచినప్పటికీ మ్యాచ్ ఆలస్యం కానుంది. అయితే కాన్పూర్లో డ్రైనేజి వ్యవస్థ గొప్పగానే ఉంటుంది. మ్యాచ్ను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి మైదాన సిబ్బంది శ్రమిస్తున్నారు.

మరోవైపు టాస్ ఆలస్యంపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చర్చ జరిపాడు. మ్యాచ్ను కొనసాగించడం గురించి రిఫరీతో రోహిత్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అదే జోరును కాన్పూర్ టెస్టులోనూ ప్రదర్శించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
బంగ్లాను చిత్తుగా ఓడించి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో మరింత ముందంజలో ఉండాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో అయినా గట్టి పోటీనివ్వాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. భారత్పై తొలి టెస్టు గెలుపు రుచి చూడాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. ఓవరాల్గా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇది 15వ టెస్టు.