బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ఆటంకం కలిగించినా చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి ఆఖరి టెస్టును గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక బంగ్లాదేశ్పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ గెలిచిన టీమిండియా పొట్టి ఫార్మాట్ సిరీస్పై కన్నేసింది. ఇవాళ నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. అయితే సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియాకు షాక్ ఎదురైంది. ఆల్రౌండర్ శివమ్ దూబె సిరీస్ నుంచి దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా దూబె సిరీస్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కిందని పేర్కొంది.

ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులో చోటు స్థానం దక్కించుకోలేకపోయాడు. దూబె గాయపడటం, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో మరికొందరు భారత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. తిలక్ తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాడు.
అయితే దూబె గాయంతో దూరమవ్వడం తెలుగు క్రికెటర్లు కలిసొచ్చే అంశంగా మారింది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇవాళ మ్యాచ్లో తుదిజట్టులో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె పేస్ ఆల్రౌండర్లుగా ఉండటంతో తొలి మ్యాచ్లో తుదిజట్టులో నితీశ్కు చోటు దక్కదనే అభిప్రాయాలు మొదట వెల్లువడ్డాయి. అయితే దూబె దూరమవ్వడంతో ప్లేయింగ్ 11లో నితీశ్కు లైన్ క్లియర్ అయ్యింది.
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ.