బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ఆటంకం కలిగించినా చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి ఆఖరి టెస్టును గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. ఇక పొట్టి ఫార్మాట్ సిరీస్పై కన్నేసింది. ఇవాళ నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకూర్పు గురించి మాట్లాడాడు. సంజు శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. సిరీస్ మొత్తానికి శాంసన్ ఓపెనర్గా వస్తాడని తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి బరిలోకి దిగుతాడని తెలిపాడు.

గత కొన్నేళ్లుగా శాంసన్ జట్టులో కొనసాగుతున్నప్పటికీ తుదిజట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లలో సగటున ఒకటి రెండు మ్యాచ్లకు మాత్రమే అవకాశం దక్కించుకుంటున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఆలస్యంగా తుదిజట్టులోకి వచ్చిన శాంసన్ రెండు మ్యాచ్ల్లోనూ డకౌటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపికైనప్పటికీ శాంసన్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కదనే సందేహాలు నెలకొన్నాయి. కానీ గిల్, జైస్వాల్కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్గా తుదిజట్టులో శాంసన్ స్థానం దక్కించుకున్నాడు.
సంజు శాంసన్తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గురించి సూర్య మాట్లాడాడు. మయాంక్ ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. ''సంజు శాంసన్ ఓపెనర్గా వస్తాడు. సిరీస్ మొత్తానికి అతను ఓపెనర్గా కొనసాగుతాడు. ఇక మయాంక్ యాదవ్ ఎక్స్ ఫ్యాక్టర్. అతనికి ఎక్స్ట్రా పేస్ సామర్థ్యం సొంతం. అతన్ని నెట్స్లో ఎదుర్కోలేదు. కానీ అతను చాలా స్పెషల్. ఎంతో టాలెంట్ ఉంది. మయాంక్ వంటి యువకులకు ఈ సిరీస్ మంచి అవకాశం. అతనిలాంటి యువకులను మనం ప్రోత్సహించాలి. అతను ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడు'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ.