దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది.
ఈ సిరీస్ను క్వీన్స్వీప్ చేసి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఇది మునపటి బంగ్లాదేశ్ కాదని, పాకిస్థాన్ను వైట్ వాష్ చేసిన నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతుందని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. బంగ్లాదేశ్ను తేలికగా తీసుకోకూడదని రోహిత్ సేనకు సూచించాడు. సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.

''ఆడిన రెండు టెస్టుల్లో పాకిస్థాన్ను ఓడించి బంగ్లాదేశ్ తమ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. కొన్నేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ తీవ్రంగానే ప్రతిఘటించింది. అయితే పాకిస్థాన్ ఓడించిన వాళ్లు ఈసారి భారత్పై సత్తాచాటాలని భావిస్తున్నారు. బంగ్లా జట్టులో కొందరు ఉత్తమ ప్లేయర్లు ఉన్నారు. మరికొందరు ప్రతిభావంతులైన యువకులు ఉన్నారు''
''ప్రత్యర్థికి భయపడకుండా తమ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభాన్ని గొప్పగా లిఖించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక పాకిస్థాన్ పరాజయంతో బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయకూడదని ప్రతి జట్టుకు తెలిసివచ్చింది. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ కచ్చితంగా ఆసక్తికరంగా మారుతుంది'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ను 2-0తో ఓడించిన సంగతి తెలిసిందే.
టెస్టు ఫార్మాట్లో పాక్పై బంగ్లాదేశ్ తొలి గెలుపు రుచి చూడటమే కాకుండా, మొదటిసారి సిరీస్ను గెలుచుకుంది. ఈ విజయంతో బంగ్లా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్ (74 పాయింట్లు, 68.52 %), ఆస్ట్రేలియా (90 పాయింట్లు, 62.50 %), న్యూజిలాండ్ (36 పాయింట్లు, 50 %), బంగ్లాదేశ్ (33 పాయింట్లు, 45.33 %) టాప్-4లో ఉన్నాయి.