చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ అర్ధశతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపరిచిన గిల్ రెండో ఇన్నింగ్స్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 79 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే గిల్ 50 మార్క్ అందుకున్న తీరు క్రికెట్ అభిమానులకు సెహ్వాగ్ను గుర్తు చేస్తోంది.
మెహది హసన్ మీర్జా వేసిన ఓవర్లో గిల్ రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 39 పరుగుల వద్ద మెహది వేసిన రెండో బంతిని సిక్సర్గా మలిచిన గిల్.. మూడు, నాలుగు బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఆ తర్వాత బంతికి క్రీజు వదిలి ముందుకు వచ్చిన గిల్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 50, 100 మార్క్ను సిక్సర్లతో అందుకుంటాడని, అదే తరహాలో గిల్ కూడా అందుకున్నాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కాగా, ఈ క్రమంలో శుభ్మన్ గిల్.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి సరసన నిలిచాడు. టెస్టు ఫార్మాట్లో గిల్, కోహ్లి 26 సిక్సర్లు బాదారు. అయితే గిల్ 26 టెస్టుల్లో, కోహ్లి 114 టెస్టుల్లో ఈ మార్క్ను అందుకున్నారు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (90 సిక్సర్లు) టాప్లో ఉన్నాడు. రోహిత్ శర్మ (84), ఎంఎస్ ధోనీ (78), సచిన్ టెండూల్కర్ (69), రవీంద్ర జడేజా (66) ఉన్నారు. ఏడో స్థానంలో ఉన్న రిషభ్ పంత్ 34 టెస్టుల్లో 57 సిక్సర్లు బాదాడు. గిల్, కోహ్లి వరుసగా 15, 16 స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ 375 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 42 ఓవర్లకు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లకు 148 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ (64 బ్యాటింగ్)తో రిషభ్ పంత్ (48 బ్యాటింగ్ ) ఉన్నాడు. 450+ ఆధిక్యం సాధించిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 149 పరుగులకు ఆలౌటైంది.