బంగ్లాదేశ్పై టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్నూ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటి.. 86 పరుగుల పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించి 2-0తో సిరీస్ సాధించింది. మూడు టీ20ల సిరీస్లో మిగిలిన నామమాత్రపు ఆఖరి టీ20 హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీస్కోర్ చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(74; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్(53; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(41; 39 బంతుల్లో, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు. అయితే ఈ క్రమంలో టీమిండియా అరుదైన ఘనత సాధించింది.
భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్లో ఏడుగురు బౌలర్లు వికెట్ పడగొట్టడం ఇదే తొలిసారి. మునుపెన్నడూ ఇది సాధ్యం కాలేదు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 11వ దేశంగా, నాలుగో పూర్తి సభ్య దేశంగా భారత్ నిలిచింది. జింబాబ్వే (బంగ్లాదేశ్పై - 2006), వెస్టిండీస్ (భారత్పై- 2010), శ్రీలంక (బంగ్లాదేశ్పై- 2018), హంగేరి (జిబ్రాల్టర్పై- 2022), ఐర్లాండ్ (బంగ్లాదేశ్పై- 2023), రువాండా (టాంజానియాపై- 2023), నమీబియా (జింబాబ్వేపై- 2023), యూఎస్ఏ (కెనడాపై-2024), జపాన్ (మంగోలియాపై- 2024), స్విట్జర్లాండ్ (సెర్బియాపై- 2024) మాత్రమే అంతకుముందు ఈ ఘనత అందుకున్నాయి.