ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. భారత్ తరువాత న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. ఈ నెల 19వ తేదీన పుణేలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రత్యర్థి జట్టు ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడం వల్ల వరుసగా నాలుగో విజయంపై భారత జట్టు కన్నేసినట్టే.

2019 తరహాలోనే ఇప్పుడు కూడా రోహిత్ శర్మ ప్రతాపం చూపిస్తోన్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో 217 పరుగుల చేశాడీ హిట్ మ్యాన్. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. సున్నాకే వెనుదిరిగాడు. జీరోతో ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ను ఆరంభించినప్పటికీ ఆ తరువాత రోహిత్ శర్మ దూకుడు బ్రేకుల్లేవ్.
ఆఫ్ఘనిస్తాన్పై 131 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ టోర్నమెంట్లో సెంచరీల జైత్రయాత్రకు నాంది పలికాడు. పాకిస్తాన్పైనా విరుచుకుపడ్డాడు రోహిత్. 86 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీని మిస్ అయ్యాడు. ఈ దూకుడు బంగ్లాదేశ్పైనా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే బంగ్లాదేశ్పై ఓ అరుదైన రికార్డ్ ఉంది రోహిత్ శర్మకు. 2025 వరల్డ్ కప్లో బంగ్లాపై సెంచరీ బాదాడు. 2019లోనూ అదే పరిస్థితి. ఇదే జట్టుపై మళ్లీ వంద పరుగులను అందుకున్నాడు. 2015, 2019 ప్రపంచ కప్లల్లో ఒకే జట్టుపై రోహిత్ శర్మ రెండుసార్లు సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుపై మరో సెంచరీ సాధిస్తాడనే ఆశిస్తున్నారు అభిమానులు.