632 రోజుల తర్వాత టెస్టు ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ శతకంతో చెలరేగాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో వన్డే తరహా బ్యాటింగ్తో సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో పంత్కు ఇది ఆరో సెంచరీ.
ఈ క్రమంలో పంత్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీతో పంత్ సమంగా నిలిచాడు. 58 ఇన్నింగ్స్ల్లో పంత్ ఆరు శతకాలు బాదగా, ఎంఎస్ ధోనీ 144 ఇన్నింగ్స్ల్లో ఆరు సెంచరీలు అందుకున్నాడు. ఇక మూడో స్థానంలో వృద్ధిమాన్ సాహా ఉన్నాడు. సాహా 54 ఇన్నింగ్స్ల్లో మూడు శతకాలు సాధించాడు.

అయితే శతకం సాధించిన కాసేపటికే పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) పెవిలియన్కు చేరాడు. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్లో షాట్కు యత్నించి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్లోనూ పంత్ కీలక పరుగులు సాధించాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును ఆదుకున్నాడు. 52 బంతుల్లో 39 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
కాగా, రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లోని 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంత్తో పాటు శుభ్మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా శతకంతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ (22 నాటౌట్; 19 బంతుల్లో, 4 ఫోర్లు) అజేయంగా నిలిచాడు.
బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, నహిద్ తలో వికెట్ తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్.. జస్ప్రీత్ బుమ్రా (4/50), ఆకాశ్దీప్ (2/19), రవీంద్ర జడేజా (2/19), మహమ్మద్ సిరాజ్ (2/30)ల ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్.