స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ విజయంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (113)తో సత్తాచాటిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
కాగా, అదే జోరులో రెండో టెస్టులోనూ సత్తాచాటి భారత్ విజయంలో మరోసారి కీలకపాత్ర పోషించాలని యాష్ పట్టుదలతో సన్నద్ధం అవుతున్నాడు. అయితే అశ్విన్ ముంగిట కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి. కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఈ రికార్డులను అందుకునే ఛాన్స్ ఉంది.

రవిచంద్రన్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే.. ప్రస్తుత టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్గా నిలుస్తాడు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్వుడ్ (48) ఉన్నాడు. మరో ఎనిమిది వికెట్లు తీస్తే ఓవరాల్గా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సాధిస్తాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అశ్విన్ 9 వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో లైయన్ (520)ను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరుకుంటాడు. ఇక యాష్ ఓ ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీస్తే, అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరతాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ (37)తో యాష్ సమంగా నిలిచాడు. అగ్రస్థానంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (67) ఉన్నారు.
యాష్ కాన్ఫూర్ టెస్టులో మరో మూడు సాధిస్తే బంగ్లాదేశ్పై భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు. ప్రస్తుతం ఆ రికార్డు జహీర్ ఖాన్ (31) పేరిట ఉంది. ఇక భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. అయితే మరో వికెట్ తీస్తే నాలుగో ఇన్నింగ్స్లో వంద వికెట్ల మార్క్ను అందుకుంటాడు.