
విరాట్పై..
ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి బాటలు వేశారు బ్యాటర్లు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీతో రెచ్చిపోయాడు. 32 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో 64 పరుగులతో ఇన్నింగ్ చివరి వరకూ నిలిచాడు. వీరిద్దరి విజృంభణకు సూర్యకుమార్ యాదవ్ కూడా తోడు కావడంతో భారీ స్కోర్ సాధించింది టీమిండియా.

ఓటమి మిగిల్చిన అసహనం..
ఈ మ్యాచ్ మిగిల్చిన ఓటమి- బంగ్లాదేశ్ జట్టుకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్టయింది. టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి కారకుడైన విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలను గుప్పించింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ విమర్శించింది. దాన్ని గుర్తించి ఉంటే తమకు అయిదు పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవని వాపోయింది. తమ జట్టు పరాజయానికి కోహ్లీ ఫేక్ ఫీల్డింగే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

ఏడో ఓవర్లో..
ఇన్నింగ్ ఏడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంగ్లాదేశ్ బ్యాటర్ నూరుల్ హసన్ చెప్పుకొచ్చాడు. 27 బంతుల్లో 60 పరుగులతో ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్న లిట్టన్ దాస్ను అవుట్ చేయడానికి విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపించాడు. అక్షర్ పటేల్ సంధించిన బంతిని లిట్టన్ దాస్ డీప్ ఆఫ్-సైడ్ వైపు షాట్ ఆడాడు. అక్కడే ఉన్న అర్ష్దీప్ సింగ్ బంతిని అందుకుని థ్రో చేశాడు. అదే సమయంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ వైపు నుంచి తాను బంతిని విసురుతున్నట్లు యాక్ట్ చేశాడని నూరుల్ హసన్ ఆరోపించాడు.

ఫేక్ ఫీల్డింగ్కు పెనాల్టీ..
ఇది బ్యాటర్లను గందరగోళానికి గురి చేసిందని పేర్కొన్నాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లు ఎరాస్మస్ గానీ, క్రిస్ బ్రౌన్ గానీ గుర్తించలేదని, అటు బ్యాటర్లు లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో కూడా పెద్దగా దీనిపై దృష్టి సారించలేదని నూరుల్ చెప్పాడు. ఇలాంటి ఫేక్ ఫీల్డింగ్స్, బ్యాటర్ను గందరగోళానికి గురి చేసే సంఘటలపై క్రికెటింగ్ యాక్ట్ 41.5 ప్రకారం.. నేరమని, దీనికి పెనాల్టీని విధించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటి బంతిని డెడ్ బాల్గా పరిగణించాల్సి ఉంటుందని అన్నాడు.


Click it and Unblock the Notifications
