ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది. నిబంధనలు వెల్లడించిన తర్వాత ఇద్దరు ఐపీఎల్ యువ స్టార్లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20తో టీమిండియా జెర్సీ ధరించారు.
అయితే ఆ మ్యాచ్తో అన్క్యాప్డ్ ప్లేయర్లు ట్యాగ్ను వాళ్లు కోల్పోయారు. ఇది ఆ ఆటగాళ్లను సంతోషంలోకి, ఎస్ఆర్హెచ్, లక్నో ఫ్రాంచైజీలను బాధలోకి నెట్టింది. ఎందుకంటే కొత్త రిటెన్షనల్ పాలసీ ప్రకారం ఆ యువ ఆటగాళ్లను ఇప్పుడు రిటైన్ చేసుకోవాలనుకుంటే.. క్యాప్డ్ ప్లేయర్ల కింద కనీసం రూ.11 కోట్లు చెల్లించాలి. అదే వాళ్లు అక్టోబర్ 30వ తేదీ వరకు అరంగేట్రం చేయకపోతే.. అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ఒక్కొక్కరికి రూ.4 కోట్లు చెల్లిస్తే సరిపోయేది. ఇది ఫ్రాంచైజీల పర్స్వ్యాల్యూపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.

అయితే బంగ్లాదేశ్ సిరీస్లో నితీశ్, మయాంక్లతో పాటు మరో ఐపీఎల్ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణాపై అందరి కళ్లు ఉన్నాయి. మయాంక్ యాదవ్ కంటే ముందు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకే తుదిజట్టులో అవకాశం వస్తుందని భావించారంతా. ఎందుకంటే హర్షిత్ రాణా శ్రీలంక సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. కానీ హర్షిత్ ఇంకా బెంచ్కే పరిమితమయ్యాడు. రేపు జరగనున్న రెండో టీ20లోనూ హర్షిత్ అవకాశం వచ్చేలా కనిపించట్లేదు.
ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్పై నెట్టింట్లో ఆరోపణలు వస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్కు ఆర్థికంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే హర్షిత్ రాణాకు తుదిజట్టులో చోటు కల్పించట్లేదని కొందరు నెటిజన్లు నిందలు వేస్తున్నారు. ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కోల్కతా విజేతగా నిలవడంలో మెంటార్గా గంభీర్ది, యువ ఫాస్ట్ బౌలర్గా హర్షిత్ రాణాది కీలక పాత్ర.
టీ20 వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో, కేకేఆర్ మెంటార్ బాధ్యతలను గంభీర్ వదిలిపెట్టి టీమిండియా కోచ్గా పదవిని చేపట్టాడు. అయితే తన మాజీ ఫ్రాంచైజీపై అభిమానంతో హర్షిత్ను ఉద్దేశపూర్వకంగా తుదిజట్టు నుంచి పక్కనపెడుతున్నాడని నెటిజన్ల వాదన. దులీప్ ట్రోఫీలో హర్షిత్ రాణా బంతితో పాటు ధనాధన్ షాట్లతో బ్యాటుతోనూ మెరిశాడు. టీ20 తుది జట్టు కూర్పును ఆల్రౌండర్ల ఫార్ములాతో నిర్మించే గంభీర్.. బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండే హర్షిత్ రాణాకు టీమిండియా ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వాలని, కానీ అలా జరగట్లేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.