మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్తో ప్రారంభంకానున్న రెండు టెస్టుల సిరీస్కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. తొలి టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లంతా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కలుసుకున్నారు. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టుతో చేరారు. కోహ్లి లండన్ నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నాడు. ఇవాళ నుంచి టీమిండియా సాధన మొదలుపెట్టింది.
అయితే టీమిండియా కోచింగ్ బృందంలోకి కొత్త బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్ చేరాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లకు సాయిరాజ్ బహుతులే తాత్కాలిక బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో మోర్కెల్ పూర్తిస్థాయి బాధ్యతలు అందుకున్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టి మోర్కెల్ను తన బృందంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే.

భారత బౌలర్ను బౌలింగ్ కోచ్గా ఎంచుకోమని బీసీసీఐ సూచించినప్పటికీ.. మోర్నే మోర్కల్నే గంభీర్ సెలక్ట్ చేసుకున్నాడు. ఐపీఎల్లో గతంలో లక్నో సూపర్ జెయింట్స్కు గంభీర్, మోర్కెల్ కలిసి పనిచేశారు. మెంటార్గా గంభీర్, బౌలింగ్ కోచ్గా మోర్కెల్ లక్నోకు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్కెల్ పనితనాన్ని మెచ్చి టీమిండియా బౌలింగ్ కోచ్గా గంభీర్ ఎంపిక చేసుకున్నాడు.
గంభీర్ బృందంలో అసిస్టెంట్ కోచ్గా ర్యాన్ టెన్ డస్కాటె, అభిషేక్ నాయర్ ఉన్నారు. ఇక ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ కొనసాగుతున్నాడు. కాగా, సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
తొలి టెస్టుకు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.