టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్నూ ఘనంగా బోణీ కొట్టింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్దీ హసన్ మీరాజ్(35 నాటౌట్; 32 బంతుల్లో, 3 ఫోర్లు), నజ్ముల్ హెస్సేన్ షాంటో(27; 25 బంతుల్లో, ఫోర్, సిక్సర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్దీప్ సింగ్(3/14) చెరో మూడు వికెట్లు, మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్య(1/26), వాషింగ్టన్ సుందర్(1/12) తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి గెలుపొందింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్(29; 19 బంతుల్లో, 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. మెహ్దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు తలో వికెట్ తీశారు.

అయితే ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ20ల్లో 100+ లక్ష్యాన్ని భారత్ అత్యంత ఎక్కువ బంతులు మిగిల్చి విజయవంతంగా ఛేదించిన మ్యాచ్ ఇదే. 49 బంతులు మిగిలుండగానే టీమిండియా విజయతీరాలకు చేరింది. అంతకుముందు ఈ రికార్డు 2016లో జింబాబ్వేపై 100 పరుగుల లక్ష్యాన్ని 41 బంతులుండగా ఛేదించిన మ్యాచ్ పేరిట ఉండేది. కాగా, ఈ మ్యాచ్తో వాషింగ్టన్ సుందర్ భారత్ తరఫున 50 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
ఈ ఘనత సాధించిన రెండో పిన్నవయస్సుడిగా వాషింగ్టన్ సుందర్ రికార్డు నెలకొల్పాడు. సుందర్ 25 ఏళ్ల ఒక్క రోజు వయసులో 50 టీ20ల మార్క్ను అందుకున్నాడు. ఈ రికార్డు అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా రిషభ్ పంత్ (24 ఏళ్ల 279 రోజులు) నిలిచాడు. ఇక ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన యువ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ తొలి ఓవర్ మెయిడిన్ వేసి అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో మెయిడిన్తో అరంగేట్రం చేసిన మూడో భారత బౌలర్గా మయాంక్ యాదవ్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు అజిత్ అగార్కర్, అర్షదీప్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్పై అర్షదీప్ మెయిడిన్స్తో టీ20ల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కాగా, ఈ మ్యాచ్లో మయాంక్ 149.9 కి.మీ/గంట వేగంతో బంతులు విసిరాడు.