కాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31; 57 బంతుల్లో, 6 ఫోర్లు) రెండో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు.
మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ పడగొట్టాడు. వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు 35 ఓవర్లు పాటే ఆట కొనసాగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యింది. అయితే ఓవర్నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ మరో 126 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.

తొలి సెషన్లో 31 ఓవర్లు ఎదుర్కొని 98 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు భారత ఫీల్డర్లు అద్భుత ప్రతిభ తోడవ్వడంతో వికెట్లు పడ్డాయి. ఆట ఆరంభమైన కాసేపటికే బుమ్రా మ్యాజిక్కు ముష్పికర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకున్నాడు.
ఆ తర్వాత ఆలస్యంగా బంతి అందుకున్న సిరాజ్ వికెట్ల వేట ఆరంభించాడు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్కు లిటన్ దాస్ ఔటయ్యాడు. మిడాఫ్లో ఉన్న రోహిత్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్కు షకిబ్ అల్ హసన్ పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్లో షకిబ్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడగా... సిరాజ్ గాల్లోనే వెనక్కి డైవ్ చేస్తూ ఎడమ చేతితో క్యాచ్ను ఒడిసిపట్టాడు.
మరోవైపు మోమినుల్ నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు. అయితే రెండో సెషన్ ఆది నుంచే బుమ్రా వికెట్లతో బంగ్లాదేశ్ను బెంబేలెత్తించాడు. వరుస ఓవర్లలో మెహదీ హసన్ (20), తైజుల్ ఇస్లామ్ (5)ను బుమ్రా బోల్తాకొట్టించాడు. ఆఖరి రెండు వికెట్లను సిరాజ్, జడేజా చెరో ఒక్కటి తీయడంతో బంగ్లాదేశ్ ఆలౌటైంది.