కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ను 'డ్రా'గా ముగించకుండా విజయం సాధించాలని టీమిండియా కసిగా ఆడుతోంది. నాలుగో రోజు ఆట రెండో సెషన్ ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. క్రీజులో మొదటి టెస్టు సెంచరీ హీరోలు శుభ్మన్ గిల్ (37), పంత్ (4) ఉన్నారు.
యశస్వీ జైస్వాల్ (72; 51 బంతుల్లో, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) పెవిలియన్కు చేరారు. వీరిద్దరు విధ్వంసం ధాటికి భారత్ టెస్టు చరిత్రలో వేగంగా 50 పరుగులు (3 ఓవర్లు), 100 పరుగులు (10.1 ఓవర్లు) అందుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 95 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 107/3తో నాలుగో రోజు ఆరంభించిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31; 57 బంతుల్లో, 6 ఫోర్లు) రెండో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.
రవీంద్ర జడేజా ఆఖరి వికెట్ పడగొట్టాడు. ఖలీద్ అహ్మద్ను రిటర్న్ క్యాచ్తో పెవిలియన్కు చేర్చాడు. అయితే ఖలీద్ వికెట్తో జడేజా తన టెస్టు కెరీర్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలో జడ్డూ అరుదైన రికార్డులు బద్దలుకొట్టాడు. 3000 పరుగులతో పాటు 300 వికెట్లను వేగంగా సాధించిన ఆసియా క్రికెటర్గా జడేజా చరిత్ర సృష్టించాడు. 73 టెస్టులు ఆడిన జడేజా 300 వికెట్లతో పాటు 3122 పరుగులు సాధించాడు.
అంతేగాక 300 వికెట్లను వేగంగా పడగొట్టిన రెండో భారత బౌలర్గా జడేజా రికార్డు నెలకొల్పాడు. 17428 బంతుల్లో జడేజా ఈ ఘనత అందుకోగా, రవిచంద్రన్ అశ్విన్ 15636 బంతుల్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్గా 3000 పరుగులు + 300 వికెట్లు సాధించిన 11వ ప్లేయర్గా, మూడో భారత క్రికెటర్గా జడేజా ఘనత సాధించాడు. జడేజా కంటే ముందు భారత్ నుంచి అశ్విన్, కపిల్ దేవ్ ఈ రికార్డు నెలకొల్పారు. అశ్విన్ 3422 పరుగులు, 524 వికెట్లు, కపిల్ దేవ్ 5248 పరుగులు, 434 వికెట్లు తీశారు. ఇక 300 వికెట్ల మార్క్ను అందుకున్న ఏడో భారత బౌలర్ జడేజా.