టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్నూ ఘనంగా బోణీ కొట్టింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలోపే ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్దీ హసన్ మీరాజ్(35 నాటౌట్; 32 బంతుల్లో, 3 ఫోర్లు), నజ్ముల్ హెస్సేన్ షాంటో(27; 25 బంతుల్లో, ఫోర్, సిక్సర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్దీప్ సింగ్(3/14) చెరో మూడు వికెట్లు, మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్య(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్(29; 19 బంతుల్లో, 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు తలో వికెట్ తీశారు.
అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్తో పోటీపడింది టీమిండియాలా లేదని, ఐపీఎల్ ప్లేయింగ్ 11 జట్టులా అనిపించిందని అన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శనపై ఆశ్చర్చం వ్యక్తం చేశాడు. ఇటీవల పాకిస్థాన్పై 2-0తో టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టులా ప్రస్తుత బంగ్లాదేశ్ కనిపించట్లేదని తెలిపాడు.
''పాకిస్థాన్ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా? భారత్ చేతిలో ఘోరపరాజయాలు చవిచూస్తోంది. తొలి టెస్టులో ఓడింది. ఇక రెండో టెస్టు దాదాపు రెండు రోజుల్లోనే ఓడింది. వర్షం కూడా బంగ్లాదేశ్ను కాపాడలేకపోయింది. ఇక టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఇండియా తన ఆధిపత్యంతో క్రికెట్ను పూర్తిగా మార్చేసింది. భారత్ ఆకలికి బంగ్లాదేశ్ ఆహారంలా మారింది. ఇక అసలు ఇది టీమిండియాలా అనిపించట్లేదు. ఐపీఎల్ ప్లేయింగ్ 11లా ఉంది. జైస్వాల్, గిల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లేరు. ఇక రవి బిష్ణోయ్ జట్టులోనే లేడు. అయినప్పటికీ 12 ఓవర్లలోపే బంగ్లాదేశ్ చిత్తుచిత్తుగా ఓడించారు'' అని బసిత్ అలీ అన్నాడు.