కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం తక్కువగా ఉన్నప్పటికీ డ్రాగా ముగించకుండా ఫలితం తీసుకురావాలనే ఉద్దేశంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.
టీమిండియా 34.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. అయినప్పటికీ టెస్టుల్లో వేగంగా 50, 100, 150, 200, 250 స్కోర్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత్ 18 బంతుల్లో 50, 61 బంతుల్లో 100, 112 బంతుల్లో 150, 148 బంతుల్లో 200, 183 బంతుల్లో 250 పరుగుల మార్క్ను అందుకుంది. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (72; 51 బంతుల్లో, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు.

విరాట్ కోహ్లి (47; 35 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), శుభ్మన్ గిల్ (39; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. తొలి ఓవర్ నుంచే టీమిండియా దూకుడుగా ఆడింది. జైస్వాల్ హ్యాట్రిక్ బౌండరీలతో, రోహిత్ శర్మ రెండు సిక్సర్లతో తమ స్కోరును ప్రారంభించారు. దీంతో ముగ్గురు స్లిప్స్తో తొలుత ఫీల్డింగ్ సెట్ చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్.. కొన్ని క్షణాల్లోనే కేవలం సర్కిల్లో ముగ్గురు ఫీల్డర్లు ఉండేలా ఆఖరి వరకు ఫీల్డింగ్ను సెటప్ చేశాడు. భారత్ విధ్వంసకర బ్యాటింగ్కు ఇదే చక్కని ఉదాహరణ.
రోహిత్ ఔటైనప్పటికీ జైస్వాల్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే హసన్ మహ్మద్ వేసిన తక్కువ ఎత్తులో బంతికి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. మరోవైపు క్రీజులోకి వస్తున్న భారత బ్యాటర్లు దూకుడు మంత్రంతో పరుగులు చేశారు. టీ20 తరహాలో బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే రాహుల్ ఔటైన మూడు బంతులకే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 107/3తో ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో సత్తాచాటాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31; 57 బంతుల్లో, 6 ఫోర్లు) రెండో టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ పడగొట్టాడు. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రే ఆట కొనసాగిన విషయం తెలసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది.