బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ను క్వీన్స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్నూ 3-0తో వైట్వాష్ చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 297 పరుగులు చేసింది. సంజు శాంసన్ (111; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్ (75; 35 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (47; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (34; 13 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ షకిబ్ మూడు వికెట్లు, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులకే పరిమితమైంది.

తౌహిద్ హృదోయ్(63 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిటన్ దాస్ (42; 25 బంతుల్లో, 8 ఫోర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో భారత్ అరుదైన ఘనతలు సాధించింది. మెన్స్ టీ20 క్రికెట్లో 200+ స్కోర్లు అత్యధిక సార్లు సాధించిన జట్టుగా టీమిండియా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది.
భారత్ 37 సార్లు 200+ స్కోరు సాధించింది. అంతకుముందు ఈ రికార్డు సోమర్సెట్ పేరిట ఉండేది. ఈ జట్టు 36 సార్లు 200+ స్కోరు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో సీఎస్కే (35), ఆర్సీబీ (33), యార్క్షైర్ (31) జట్లు ఉన్నాయి. ఇక టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 200+ స్కోరు సాధించిన జట్టుగా రెండో స్థానంలోనూ భారత్ నిలిచింది. ఈ ఏడాది టీమిండియా 6 సార్లు ఈ ఘనత సాధించింది. తొలి స్థానంలో జపాన్ (7 సార్లు, 2024)తో సంయుక్తంగా టీమిండియా (2023) ఉంది.

కాగా, పరుగుల పరంగా భారత్కు ఇది మూడో అతిపెద్ద విజయం. 2023లో న్యూజిలాండ్పై 168 పరుగుల తేడాతో, 2018లో ఐర్లాండ్పై 143 పరుగుల తేడాతో సాధించిన విజయాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా (297/6) భారత్ రికార్డులకెక్కింది. తొలి స్థానంలో నేపాల్ (314/3 వర్సెస్ మంగోలియా) ఉంది.