చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగుల భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) గొప్పగా పోరాడాడు. యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ (5/83) వికెట్లతో మెరిశాడు. తస్కిన్ అహ్మద్ మూడు (3/55) వికెట్లు తీశాడు. ఓవర్నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ తస్కిన్ ధాటికి మరో 37 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి రోజు ఆటలో మొదటి రెండు ఇన్నింగ్స్ల్లో బంగ్లాదేశ్ మరింత ఆధిపత్యం చెలాయించింది.

భారత్ 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ టీమిండియా 376 స్కోరు సాధించిందంటే అశ్విన్, జడేజా అద్భుత పోరాటమే. అయితే ఈ క్రమంలో 'రోహిత్ సేన' అరుదైన రికార్డు నెలకొల్పింది. గత 53 ఏళ్లలో 150 స్కోరులోపే ఆరు వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన భారత జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. మొత్తంగా భారత టెస్టు చరిత్రలో 150 లోపు ఆరు వికెట్లు కోల్పోయిన సందర్భాల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు.
ఈ జాబితాలో 1971లో వెస్టిండీస్పై సాధించిన 347 పరుగులు అగ్రస్థానంలో ఉంది. బ్రిడ్జ్టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ దిలీప్ సర్దేశాయ్ (150) శతకంతో సత్తాచాటడంతో భారత్ చివరి నాలుగు వికెట్లకు 277 పరుగులు జోడించింది. బంగ్లాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ సేన ఆఖరి నాలుగు వికెట్లకు 232 పరుగులు చేసింది.
ఆ తర్వాతి స్థానాల్లో 219 పరుగులు (146/6 నుంచి 365 ఆలౌట్- 2021లో ఇంగ్లండ్పై), 210 పరుగులు (119/6 నుంచి 329 ఆలౌట్- 1996లో దక్షిణాఫ్రికాపై) ఉన్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న చెపాక్ టెస్టులో మరో అరుదైన రికార్డు నమోదైంది. సొంతగడ్డపై ఓ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు అందరూ క్యాచ్ ఔట్తో వెనుదిరగడం ఇది నాలుగోసారి. అంతకుముందు 1998 (న్యూజిలాండ్), 2001 (ఆస్ట్రేలియా), 2021 (ఇంగ్లండ్)లో ఇదే తరహాలో ఔటయ్యారు.