బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను గెలుచుకుంది. 173.2 ఓవర్లలో ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో చిన్న మ్యాచ్.
అయితే తమ జట్టు ఓటమిపై బంగ్లాదేశ్ కోచ్ చండికా హతురసింఘ స్పందించాడు. ఓటమి గల కారణాలు వివరిస్తూ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల తమ జట్టు చాలా మెరుగుపడిందని, ఇతర జట్లతో గొప్పగా పోరాడుతున్నామని, కానీ భారత్ వేరే లెవల్లో ఉందని హతురసింఘ అన్నాడు. టీమిండియా పూర్తిగా మరో స్థానంలోకి వెళ్లిపోయిందని తెలిపాడు.

భారత తుది జట్టు స్థానంలో తీవ్ర పోటీ ఉంటుందని, భారత్ వ్యవస్థ, సౌకర్యాలు కనిపించకుండానే మెరుగయ్యాని హతురసింఘ అన్నాడు. దీన్ని చూసి తామెంతో నేర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. జట్టుగా అభివృద్ధి చెందడమే కాకుండా, కింద ఉన్నవాటిని మెరుగుపర్చుకుంటూ బలమైన పునాది వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. ఇక పాకిస్థాన్ను ఓడించి తాము గాల్లోకి ఏం తేలిపోలేదని, పాక్-భారత్ ఒక్కటి కాదని తమకు తెలుసని అన్నాడు. భారత్లో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని ముందే తెలుసని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆత్మవిశ్వాసంతో భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ వచ్చింది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో భారత్పై టెస్టు సిరీస్ గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేశాడు. కానీ చిత్తుగా ఓటమిపాలయ్యారు. ''మా ప్రదర్శన పరంగా ఓటమి మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. భారత్ ఆడిన విధానాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. క్రెడిట్ మొత్తం రోహిత్కు, టీమిండియా అప్రోచ్కు ఇవ్వాలి''
''భారత్ దూకుడుకు మేం సరిగ్గా స్పందించలేదు. ఈ సిరీస్లో మా బ్యాటింగ్ ఎంతో నిరాశపర్చింది. ఇక మేం పాకిస్థాన్ను ఓడించి ఇక్కడకు వచ్చాం. అయితే భారత్లో ఉండే సవాళ్లు మాకు తెలుసు. పాక్పై గెలిచిన తర్వాత మేం గాల్లో ఏం తేలలేదు. అలాగే ఈ ఫలితం తర్వాత మరింత దిగజారిపోయినట్లు భావించట్లేదు. పాకిస్థాన్లో విజయం కోసం ఏం చేశామో మాకు తెలుసు. అలాగే భారత్తో ఇక్కడ మేం పోటీపడలేమని మాకు తెలుసు'' అని హతురసింఘ పేర్కొన్నాడు.