ఊహించినట్లుగానే జరుగుతోంది. భారత్కు బంగ్లాదేశ్ గట్టి పోటీని ఇస్తోంది. పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ కొత్త ఉత్సాహంతో సత్తాచాటుతోంది. చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆదిలోనే టీమిండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది. హసన్ మహ్మద్ నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు. అతని ధాటికి పది ఓవర్లలోపే ముగ్గురు భారత స్టార్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు.
ఆరో ఓవర్ తొలి బంతికి టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్)ను హసన్ మహ్మద్ ఔట్ చేశాడు. షాట్కు యత్నించిన రోహిత్ స్లిప్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లో శుభ్మన్ గిల్ను హసన్ డకౌట్ చేశాడు. లెగ్సైడ్ దిశగా వెళ్తున్న బంతిని వెంటాడి గిల్ వికెట్ కీపర్ లిటన్ దాస్కు దొరికిపోయాడు.

ఇక తర్వాతి ఓవర్లో కింగ్ కోహ్లి (6; 6 బంతుల్లో)ని ఔట్ చేసి హసన్ భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. బంతిని డ్రైవ్ చేస్తూ బౌండరీకి కోహ్లి యత్నించగా బంతిని ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతుల్లోకి వెళ్లింది. అయితే 17 ఏళ్ల తర్వాత టీమిండియా ముగ్గురు బ్యాటర్లు లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలి ఇన్నింగ్స్లో పది ఓవర్లలోపు పెవిలియన్కు చేర్చిన బౌలర్గా హసన్ మహ్మద్ చరిత్రకెక్కాడు.
అంతకుముందు ఈ ఘనతను శ్రీలంక బౌలర్ చనక వెల్గెదర 2009లో సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ను చనక పది ఓవర్లలోపు పెవిలియన్కు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ శతకాలతో కదం తొక్కడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరి, చెపాక్ టెస్టులో భారత్ తిరిగి పటిష్టస్థితిలో నిలవాలంటే మన బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కాగా, ప్రస్తుతం రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్ క్రీజులో ఉన్నారు.