చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభ్మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కడంతో.. రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్నైట్ స్కోరు 81/3తో శనివారం ఆటను ఆరంభించిన పంత్, గిల్ సాధికారికంగా ఆడారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ బౌండరీ, సిక్సర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. 79 బంతుల్లో గిల్, 88 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ సాధించారు. 50 మార్క్ను దాటిన తర్వాత గేర్ మార్చి మరింత దూకుడుగా ఆడారు. పంత్ 124 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో పంత్కు ఇది ఆరో సెంచరీ.

అయితే సెంచరీ సాధించిన అనంతరం పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోవైపు గిల్ నిలకడగా ఆడుతూ శతకం అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన గిల్ రెండో ఇన్నింగ్స్లో చెలరేగాడు. 161 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో గిల్కు ఇది అయిదో శతకం. ఓవరాల్గా గిల్కు ఇది 12వ ఇంటర్నేషనల్ సెంచరీ. పంత్తో కలిసి గిల్ నాలుగో వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కేఎల్ రాహుల్ (22 నాటౌట్; 19 బంతుల్లో, 4 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, నహిద్ తలో వికెట్ తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్.. జస్ప్రీత్ బుమ్రా (4/50), ఆకాశ్దీప్ (2/19), రవీంద్ర జడేజా (2/19), మహమ్మద్ సిరాజ్ (2/30)ల ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 227 పరుగుల ఆధిక్యం దక్కింది.