చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. మరో ఆరు వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనమవుతుంది. రవిచంద్ర్ అశ్విన్ (3/63) ధాటికి.. మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది. వెలుతురులేమి కారణంగా శనివారం ఆట కాసేపు ముందుగా ముగిసింది.
515 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించింది. బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (33; 47 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), షాద్మాన్ ఇస్లామ్ (35; 68 బంతుల్లో, 3 ఫోర్లు) తొలి వికెట్కు 62 పరుగులు జోడించారు. రెండో సెషన్ ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన వీరద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఆఖరి సెషన్ మొదలైన కాసేపటికే బంగ్లాదేశ్ను బుమ్రా దెబ్బకొట్టాడు. జకీర్ను పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత వికెట్ల వేటను అశ్విన్ ప్రారంభించాడు. కుదురుకున్న బ్యాటర్లను తెలివిగా క్రమం తప్పకుండా ఔట్ చేశాడు. అయితే వికెట్లు పడుతున్నా బంగ్లా బ్యాటర్లు కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (51 బ్యాటింగ్; 60 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం చేశాడు.
అయితే భారత బౌలర్లను కాచుకుని రెండు రోజులు బంగ్లా బ్యాటర్లు ఏ మేరకు నిలుస్తారనేదే ఆసక్తికరం. చివరి రెండు రోజుల ఆటలో వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు.
పంత్ 124 బంతుల్లో, గిల్ 161 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నారు. కేఎల్ రాహుల్ (22 నాటౌట్; 19 బంతుల్లో, 4 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, నహిద్ తలో వికెట్ తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. జస్ప్రీత్ బుమ్రా (4/50) నాలుగు వికెట్లు తీశాడు.