కాన్పూర్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మైదానంలో ప్రేక్షకుల ముందు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కోహ్లిని ఔట్ చేసే ప్రమాదంలోకి నెట్టిన పంత్ తన తప్పును తెలుసుకుని సారీ చెప్పాడు.
అయితే అదృష్టవశాత్తు విరాట్ కోహ్లి ఔట్ నుంచి తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్ ఖలీద్ అహ్మద్ అత్యంత సునాయాసమైన రనౌట్ను చేయలేకపోయాడు. అడుగు దూరంలో ఉన్న వికెట్లకు ఖలీద్ త్రో వేయలేకపోవడం గమనార్హం. మరోవైపు ఔట్ అని భావించి కోహ్లి క్రీజులోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ నాటకీయమైన సంఘటన సోమవారం ఆటలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..18వ ఓవర్లో ఖలీద్ అహ్మద్ వేసిన తొలి బంతిని కోహ్లి డ్రైవ్కు ప్రయత్నించాడు. అయితే అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి ప్యాడ్లకు తాకి ఆఫ్సైడ్ దిశగా నెమ్మదిగా వెళ్లింది. దాంతో కోహ్లి సింగిల్కు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్లో ఉన్న రిషభ్ పంత్ కూడా సై అంటూ సింగిల్కు ఓకే చెప్పాడు. ఇద్దరూ పిచ్ సగం దూరం వరకు వచ్చారు. కానీ రనౌటయ్యే ఛాన్స్ ఉందని పంత్ ఆగిపోయాడు.
మరోవైపు అది చూసి కోహ్లి అసహనంతో అక్కడే ఆగిపోయాడు. అప్పటికే బంతి దగ్గరికి బౌలర్ ఖలీద్ వచ్చాడు. వెనక్కి మళ్లీ ఖలీద్ను దాటి క్రీజుకు చేరడం కోహ్లి అసాధ్యమే. అంతేగాక ఖలీద్ వికెట్లకు చాలా దగ్గరగా ఉన్నాడు. దాంతో కోహ్లి ఇక తాను ఔట్ నుంచి తప్పించుకోవడం కష్టమని ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఒత్తిడికి గురైన ఖలీద్ అడుగు దూరంలో ఉన్న వికెట్లకు గురి పెట్టలేకపోయాడు. బంతి స్టంప్ను తాకకుండా మిస్ అయ్యింది.
అది సులువైన త్రో అవ్వడంతో వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేడు. దాంతో కోహ్లి బతికిపోయాడు. అయితే పంత్ వైపు ఆవేశంతో కోహ్లి చూశాడు. విరాట్ కన్నెర్ర చేయడంతో పంత్ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. తప్పు నాదే అంటూ కౌగిలించుకుని సారీ చెప్పాడు. ఆ తర్వాత కోహ్లి చిరునవ్వుతో రిప్లై ఇవ్వడంతో పంత్ ఊపిరిపీల్చుకున్నాడు.