కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. నాలుగో రోజు ఆట మొదలైంది. వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు 35 ఓవర్లు పాటే ఆట కొనసాగిన విషయం తెలిసిందే. రెండో రోజు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యింది. ఆదివారం వర్షం కురవనప్పటికీ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆటను కొనసాగించలేకపోయారు.
వాన జాడ లేకపోవడం, సూర్యుడు ప్రకాశవంతంగా ఉండటంతో సోమవారం ఆట మొదలైంది. ఇవాళ 98 ఓవర్ల పాటు ఆట కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో సెషన్ల టైమింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 వరకు తొలి సెషన్ జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 12.25 నుంచి 2.40 వరకు, ఆఖరి సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

కవర్ల కింద కాస్త తేమ ఉండటంతో ఇవాళ ఆటలో తొలి గంట బౌలర్లకు సహకరిస్తోంది. అయితే ఓవరాల్గా వికెట్ బ్యాటింగ్కు అనుకూలం. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగుల మోత మోగించగలరు. ఇరు జట్ల బౌలర్లు చెలరేగితేనే ఈ మ్యాచ్ ఫలితం వస్తుంది. లేదంటే డ్రాగా ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ 38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (7), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆటలో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 24 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా జకీర్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే మరో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(24)ను కూడా ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (27) బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన అతన్ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్తో మోమినల్ హక్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు.