కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు వర్షార్పణమైంది. వరుణుడు తీవ్ర ప్రతాపం చూపించడంతో ఒక్క బంతి పడకుండా రెండో రోజు ఆట రద్దయింది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ మైదానం పూర్తిగా తడిసిపోయింది. మిగిలిన సమయంలో ఔట్ ఫీల్డ్ను మెరుగుపర్చడం కష్టమని భావించిన అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం ఉదయం నుంచి మైదానంలో కవర్లను కప్పి ఉంచారు. రేపు ఆట జరిగే అవకాశం ఉంది. అయితే సజావుగా సాగడం అనుమానమే అనిపిస్తోంది. వర్షం ముప్పు ఉంది. కాగా, ఇవాళ లంచ్ విరామానికి ముందే ఇరు జట్లు ఆటగాళ్లు మైదానాన్నివిడిచి హోటల్కు చేరుకున్నారు. మైదానం సిద్ధమవ్వడానికి ఆలస్యం అవుతుందని భావించి హోటల్కు ముందుగానే వెళ్లిపోయారు.

కాగా, వరుణుడు ప్రభావంతో తొలి రోజు ఆటలో కేవలం 35 ఓవర్లు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (6), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా తొలి రోజు ఆట గంట ఆలస్యంగా మారింది. అయితే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో లంచ్ విరామ సమయానికి ముందే ఆటగాళ్లు మైదానాన్ని వీడారు.
రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే వర్షం పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసిందని ప్రకటించారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 24 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా జకీర్ పెవిలియన్ చేరాడు. సెకండ్ స్లిప్ యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్తో వెనుదిరిగాడు.
కాసేపటికే మరో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(24)ను కూడా ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (27) బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన అతన్ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్తో మోమినల్ హక్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.