చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగుల భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ (5/83) వికెట్లతో మెరిశాడు. తస్కిన్ అహ్మద్ మూడు (3/55) వికెట్లు తీశాడు.
అయితే ఓవర్నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ మరో 37 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న జడేజాను తస్కిన్ ఔట్ చేసి ఇవాళ భారత్ను తొలి దెబ్బ కొట్టాడు. లైఫ్లు లభించినా దూకుడుగా ఆడుతున్న ఆకాశ్ దీప్ (17; 30 బంతుల్లో, 4 ఫోర్లు)ను కాసేపటికే తస్కిన్ ఔట్ చేశాడు.

స్వల్ప వ్యవధిలోనే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఔటవ్వడంతో భారత్ ఆలౌట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జస్ప్రీత్ బుమ్రా (7; 9 బంతుల్లో, 1 ఫోర్) పరుగులు చేశాడు. కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు శుభారంభం దక్కలేదు. నిన్న ఆటలో తొలి రెండు సెషన్లలో బంగ్లా బౌలర్లు చెలరేగారు. హసన్ మహ్మద్ ధాటికి భారత్ 34/3తో కష్టాల్లో పడింది.
యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) సాయంతో భారత్ తిరిగి పుంజుకుంది. కానీ బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి టీమిండియాను 144/6కు కట్టడి చేశారు. దీంతో భారత్ 250 దాటడం కష్టమే అని భావించారంతా. కానీ అశ్విన్, జడేజా పోటాపోటీగా పరుగులు చేస్తూ బంగ్లా బౌలర్లను నిస్సహాయులుగా మార్చారు. ఏడో వికెట్కు 199 పరుగులు జోడించి టీమిండియాను టాప్లో ఉంచారు.