భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా రేపటి నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అదే జోరును కాన్పూర్ టెస్టులోనూ ప్రదర్శించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. నెట్స్లో చెమటోడుస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. తొలి టెస్టులో రాహుల్ 16, 22 (నాటౌట్) పరుగులు చేశాడు. అయితే మొదటి ఇన్నింగ్స్లో రాహుల్ స్పిన్ బౌలింగ్లో సునాయసంగా వికెట్ సమర్పించుకన్నాడు. మెహది హసన్ మిరాజ్ వేసిన బంతిని సరిగ్గా డిఫెన్స్ చేయడంలో విఫలమై షార్ట్ లెగ్లో ఉన్న జకీర్ హసన్కు రాహుల్ చిక్కాడు.

దీంతో రాహుల్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించాడు. అయితే నెట్స్లో రాహుల్ను చూసి గంభీర్ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. స్పిన్లో తన కాళ్లను మరింత మెరుగ్గా ఉపయోగించాలని రాహుల్కు గంభీర్ సూచించాడు. ఆ తర్వాత రాహుల్ క్రీజును వదిలి బయటకు వచ్చి భారీ షాట్లు ఆడాడు. ఆ తర్వాత రాహుల్ను తన మణికట్టును ఉపయోగించి సింగిల్స్కు షాట్లు ఆడమని చెప్పాడు. దానికి తగ్గట్లుగా రాహుల్ మెరుగ్గా శిక్షణ పూర్తిచేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్లో కెప్టెన్గా రాహుల్, మెంటార్ గంభీర్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం బలంగా మారింది. ఇటీవల తొలి టెస్టు తుదిజట్టు ఎంపిక గురించి మాట్లాడుతూ రాహుల్ సామర్థ్యంపై గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. రాహుల్కు గొప్ప నైపుణ్యం ఉందని, అలాంటి ప్లేయర్ కోసం సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ బెంచ్పై ఉండాల్సి వస్తుందని గంభీర్ అన్నాడు.
కాగా, ఈ సంఘటనలతో కేఎల్ రాహుల్పై గంభీర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాహుల్ను మూడు ఫార్మాట్లలో టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చాలని గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ వన్డే, టెస్టు జట్టులోనే కొనసాగుతున్నాడు. కాగా, 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రాహుల్ ఓ దశలో భారత భవిష్యత్ కెప్టెన్గా పేరు పొందాడు. కానీ ఆ తర్వాత క్రమంగా తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు గంభీర్ రాకతో రాహుల్ భవిత్యవం మారుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.