ఇండియా-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20ల ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ప్రత్యర్థి స్పిన్ను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక భారత బౌలింగ్ దళంపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ జట్టులో ఉండటం అదృష్టమని పేర్కొన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని గంభీర్ కొనియాడాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు రెండు రోజుల్లో ముగిసిన సందర్భాన్ని గుర్తిస్తూ.. భారత్లో ఇలానే జరిగితే చర్చలు మొదలుపెట్టకుండా స్పిన్ ఆడటం నేర్చుకోవాలని అన్నాడు.

''మా బ్యాటింగ్ యూనిట్ ఎంతో నాణ్యతమైనది. ప్రపంచంలో ఏ స్పిన్ బృందాన్ని అయినా ఎదుర్కోగలదు. టెస్టులు, వన్డేలు పూర్తిగా భిన్నమైనవి. ఒకప్పుడు భారత్ బ్యాటింగ్పై ఆధారపడేది. కానీ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్.. దాన్ని బౌలర్ల ఆటగా మార్చారు. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బుమ్రా. అతను మ్యాచ్ను ఏ దశలో అయిన నియంత్రణలోకి తీసుకురాగలడు''
''అశ్విన్, జడేజా జట్టులో ఉండటం భారత్ అదృష్టం. ప్రస్తుత జట్టులోని ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాను. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నా. ఇక దక్షిణాఫ్రికాకు భారత్ వెళ్లినప్పుడు టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఫాస్ట్ బౌలర్లకు ఎంతగానో పిచ్ సహకరిస్తే ఎవరూ మాట్లాడలేదు. అక్కడతో చర్చ ముగిసింది. అదే భారత్లో రెండు రోజుల్లో ఆట ముగిస్తే.. ఇకపై చర్చించకుండా స్పిన్ను ఎదుర్కోవడం నేర్చుకోవాలి''
''పాకిస్థాన్లో బంగ్లాదేశ్ సాధించిన విజయానికి శుభాకాంక్షలు చెబుతున్నా. అయితే ఇది మరో కొత్త సిరీస్. వాళ్లలో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. షకిబ్, ముష్ఫికర్, మెహది వంటి సీనియర్లు ఉన్నారు. మేం తొలి బంతి నుంచి మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం'' అని గంభీర్ పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.