కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు హాజరైన బంగ్లా సూపర్ ఫ్యాన్ 'టైగర్ రాబి' ఆసుపత్రిలో చేరాడు. స్థానిక టీమిండియా అభిమానులు దాడి చేయడంతో అతను ఆసుప్రతి పాలయ్యాడని తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న టైగర్ రాబిను భద్రతా సిబ్బంది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు.
నివేదిక ప్రకారం.. తొలి రోజు ఆట ఆరంభంలో రాబికి, స్థానిక టీమిండియా అభిమానులకు గొడవ అయినట్లు తెలుస్తోంది. సీ బ్లాక్లో ఉన్న రాబి బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ, మద్దతుగా నినాదాలు చేశాడు. ఈ క్రమంలో తన ముందు స్టాండ్స్లో ఉన్న ప్రేక్షకులతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత లంచ్ బ్రేక్లో కొందరు అభిమానులు రాబిపై దాడికి దిగారని సమాచారం.

ఆసుపత్రికి వెళ్తూ బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రాబి మీడియాతో మాట్లాడారు. పొత్తికడుపులో, వీపున బలంగా కొట్టారని, దీంతో ఊపిరి తీసుకోవడం కష్టమైందని రాబి చెప్పారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తనని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అయితే పోలీసు అధికారులు దీనిపై స్పందిస్తూ.. దాడి జరిగిందని ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు. రాబి డీహైడ్రేషన్ వల్ల కూడా బాధపడుతున్నాడని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లను నిర్వహించకుండా అడ్డుకుంటామని హిందు మహా సభ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాన్పూర్ మైదానానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. భారత్, బంగ్లా ఆటగాళ్లకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మైదానంలోనూ భద్రతా సిబ్బందిని పెంచారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ తడి ఔట్ ఫీల్డ్, వెలుతురులేమి కారణాలతోనూ ఆటకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్ (6), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (31), ఓపెనర్లు జకీర్ హసన్ (0), షాద్మాన్ (24) పరుగులు చేశారు.