భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20ల ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియానే ఫేవరేట్ అయినప్పటికీ, పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్స్వీప్ చేయడంతో సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్ను దీటుగా ఎదుర్కొంటుందా, పాకిస్థాన్ను ఓడించినట్లేగానే టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పాక్ను ఓడించడంలో బంగ్లా స్పిన్నర్లుది కీలక పాత్ర. ఇక తొలి టెస్టు వేదిక అయిన చెపాక్ కూడా సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిచ్ను ఏ విధంగా రూపొందిస్తారనే ఆసక్తి మొదలైంది. అయితే చెపాక్ పిచ్ గురించి బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చందిక హతురసింఘూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

స్పోర్టింగ్ వికెట్లా కనిపిస్తుందని, కానీ ఎప్పటి నుంచి బంతి టర్న్ అవుతుందో అర్థం కావట్లదేని హతురసింఘూ అన్నాడు. ''ఇది చూడటానికి ఈ స్థితిలో స్పోర్టింగ్ వికెట్లా కనిపిస్తుంది. కానీ ఉపఖండ పిచ్ పరిస్థితులతో పోలిస్తే తొలి రోజు నుంచి కూడా స్వభావం మారవచ్చు. ఎప్పటి నుంచి టర్న్ అవుతుందో తెలియదు'' అని హతురసింఘూ పేర్కొన్నాడు. అయితే వికెట్ను సమతూకంతో ఉండేలా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించినా, బంతి గింగిరాలు తిరుగుతూ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించేలా ఉండకపోవచ్చని సమాచారం.
చెపాక్ పిచ్ గురించి సీనియర్ క్యురేటర్ స్పందిస్తూ.. గత రెండు వారాలుగా చెన్నైలో వాతావరణం వేడిగా ఉందని, 30+ డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత ఉందని, దీంతో పిచ్కు నీళ్లు పడుతున్నామని అన్నారు. అయితే మ్యాచ్ సాగేకొద్ది స్పిన్కు అనుకూలంగా మారుతుందని, బ్యాటర్లకు సవాలుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి పిచ్పై పచ్చిక ఉంది. కాగా, ప్రపంచంలో అత్యుత్తమ జట్టు అయిన భారత్ను ఎదుర్కోవడం తమకు కఠినమైన సవాల్ అని బంగ్లా కోచ్ హతురసింఘూ అన్నాడు.
టీమిండియాతో ఆడితే తమ అసలు సత్తా తెలుస్తుందని హతురసింఘూ పేర్కొన్నాడు. పాకిస్థాన్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం తమ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడితే మంచి ఫలితాలు వస్తాయని పాక్ పర్యటన నిరూపించిందని చెప్పాడు. తమ జట్టు సమతూకంగా ఉందని, స్పిన్, పేస్, బ్యాటింగ్లో సత్తాచాటే ఆటగాళ్లు ఉన్నారని బంగ్లాదేశ్ కోచ్ తెలిపాడు.