టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటి ఆల్రౌండ్ షోతో అలరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (53 రిటైర్డ్ హట్, 32 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు.
హార్దిక్ పాండ్య (40 నాటౌట్; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31; 18 బంతుల్లో, 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. మహేది హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 122 పరుగులే చేసింది. మహ్మదుల్లా (40; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), షకిబ్ అల్ హసన్ (32; 34 బంతుల్లో) టాప్ స్కోరర్లు.

అర్షదీప్ సింగ్ (2/12), శివమ్ దూబె (2/13) చెరో రెండు వికెట్లు, బుమ్రా (1/12), సిరాజ్ (1/17), అక్షర్ పటేల్ (1/10), హార్దిక్ (1/30) తలో వికెట్ తీశారు. అమెరికాకు ఆలస్యంగా చేరుకున్న విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. అయితే విజయానంతరం టీమిండియా రోహిత్ శర్మ మాట్లాడాడు. వార్మప్ మ్యాచ్లో సాధించాలనుకున్న లక్ష్యాలను అందుకున్నామని అన్నాడు. బ్యాటర్లు, బౌలర్లు సమష్టి రాణించడంతో గెలిచామని తెలిపాడు.
అర్షదీప్ సింగ్కు ఎంతో నైపుణ్యం ఉందని రోహిత్ కొనియాడాడు. వన్డౌన్లో వచ్చిన పంత్ గురించి స్పందిస్తూ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఇదే తుది నిర్ణయం కాదని చెప్పాడు. ''అన్నీ మాకు అనుకూలంగా మారడంపై సంతోషంగా ఉంది. వార్మప్ మ్యాచ్లో ఆశించిన ఫలితమే దక్కింది. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడటమే చాలా ముఖ్యం. కొత్త వేదిక, కొత్త మైదానం, కొత్త డ్రాప్ ఇన్ పిచ్ను అర్థం చేసుకోవడమే కీలకం. ఈ విషయంలో మేం రాణించాం''
''మూడో స్థానంలో పంత్కు సాధారణంగా అవకాశం ఇచ్చాం. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ను ఫాలో అవ్వాలని మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక బౌలర్లు కూడా సత్తాచాటారు. తన సత్తా ఏంటో అర్షదీప్ సింగ్ గతంలో కూడా నిరూపించాడు. అతను ఎంతో నైపుణ్యమైన బౌలర్. ప్రారంభంలోనే కాకుండా డెత్ ఓవర్లలోనూ సత్తాచాటగలడు. ఈ మ్యాచ్లోనూ మనం చూశాం. మా దగ్గర 15 మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. పరిస్థితులను బట్టి తుదిజట్టును ఎంపిక చేస్తాం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.