చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు భారత్దే ఆధిప్యతం. తొలి రెండు సెషన్ల వరకు బంగ్లాదే పైచేయి. కానీ, రవిచంద్రన్ అశ్విన్ (102 బ్యాటింగ్; 112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (86 బ్యాటింగ్; 117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) గొప్ప పోరాటంతో టీమిండియా టాప్లో నిలిచింది.
హసన్ మహ్మద్ ధాటికి భారత్ 34/3తో కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) సాయంతో భారత్ తిరిగి పుంజుకుంది. కానీ బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి టీమిండియాను 144/6కు కట్టడి చేశారు. దీంతో భారత్ 250 దాటడం కష్టమే అని భావించారంతా. కానీ అశ్విన్, జడేజా పోటాపోటీగా పరుగులు చేస్తూ బంగ్లా బౌలర్లను నిస్సహాయులుగా మార్చారు. అభేద్యంగా ఏడో వికెట్కు 195 పరుగులు జోడించారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ 339/6తో మెరుగైన స్థితిలో నిలిచింది.

కాగా, అశ్విన్ బ్యాటింగ్ తనకి తెలుగు దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను గుర్తు చేసిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతుల్ని లక్ష్మణ్ సొగసైన షాట్లతో బౌండరీకి తరలించినట్లుగానే అశ్విన్ ప్రశాంతతో ఆడాడని చెప్పాడు. భారత్ బ్యాటింగ్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిన వీవీఎస్ లక్ష్మణ్ స్టైలిస్ ఆటతో పరుగులు ప్రవాహం సృష్టించిన విషయం తెలిసిందే.
''బంతి అతని వద్దకు వచ్చేలా అశ్విన్ ఆడుతున్నాడు. కాళ్ల వైపు వచ్చిన బంతుల్ని అశ్విన్ ఆడే విధానం చూస్తుంటే వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకు వస్తున్నాడు. అశ్విన్ డ్రైవ్ షాట్లు, స్పిన్లో మోకాళ్లపై కూర్చొని సిక్సర్లు బాదడం గొప్పగా ఉంది. జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ తొలి రోజు ఆటలో క్రెడిట్ మాత్రం అశ్విన్కే ఇవ్వాలి''
''అశ్విన్ పరుగులు సాధించడం సాధారణమే. కానీ కొంతకాలంగా అతని బ్యాటింగ్ పరంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కిందకు వెళ్లిపోయాడు. కానీ యాష్ గొప్ప ఆటగాడు. ఒత్తిడిని జయించే సామర్థ్యం అతని సొంతం. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు ఇటీవల టీ20 వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీ ఆడారు. కానీ అశ్విన్ చివరిగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనే ఆడాడు'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.